కనీవినీ ఎరుగని స్థాయికి క్రూడాయిల్ ధ‌ర‌లు పతనం

ప్రపంచ చరిత్రలో ముడిచమురు ధర  పాతాళానికి పడిపోయింది. కరోనా వైరస్ దెబ్బకి ధ‌ర‌లు భారీగా పతనమయ్యాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో మైనస్‌లలోకి వెళ్లిపోయాయి. డబ్ల్యూ‌టీఐ క్రూడ్ ధర ఏకంగా మైనస్ 38 శాతం కుప్పకూలింది. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొద‌టిసారి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఉత్తర అమెరికాలో ఆయిల్ ఉత్పత్తిదారుల వద్ద వెలికితీసిన ముడి చమురును నిల్వ చేయడానికి స్టోరేజ్ లేకపోవడం ఇందుకు కారణంగా చెప్పు్కోవచ్చు. కరోనా వైరస్ వల్ల డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో క్రూడ్ ఓవర్ సప్లై అవుతోంది. దీంతో అదనపు క్రూడ్‌ను నిల్వ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నిల్వ చేయడానికి కూడా స్థలం లేదు.


ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ నేప‌థ్యంలో ముడిచమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుంటే, కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చమురు రంగ వ్యాపారులు వాపోతున్నారు. సమీప భవిష్యత్తులో ఆర్థిక రికవరీ కనిపించడం లేదని, తమ వద్ద అధికంగా ఉన్న నిల్వలను తగ్గించుకునేందుకు చమురు ఉత్పత్తి దేశాలు, ఎదురు డబ్బిచ్చి మరీ వాటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి తలెతతిందని గగ్గోలు పెడుతున్నాయి.